వేమూరు నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం, 1962 వ సంవత్సరంలో ఏర్పడింది. ఈ ప్రాంతంలోని, కొల్లూరు ఇటుకలకు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరుంది. ఈ నియోజకవర్గపు పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుంటూరు జిల్లాలోనే ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుంది. సినీ, రాజకీయ రంగాలలో వేమూరు నియోజకవర్గనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయా రంగాలలో పలువురు ఉద్దండులు ఈ ప్రాంతానికి చెందినవారే కావటం విశేషం.
ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 185485 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 94226 కాగా మగవారి సంఖ్య 91246. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. వరి, అపరాలు మరియు కాయగూరలు ఈ నియోజకవర్గపు ప్రధాన పంటలు.
కొణిజేటి రోశయ్య సమావేశ మందిరం - ఈ మందిరాన్ని, శ్రీ కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు.
శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము - ఈ ఆలయానికి రెండు శతబ్దాల చరిత్ర ఉంది.